‘SSMB29’: జక్కన్న బోను నుంచి బయటపడిన మహేశ్‌.. వీడియో

by | Apr 5, 2025 | సినిమా

సూపర్ స్టార్ మహేశ్‌బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళిల కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్‌ రూపొందనున్న సంగతి తెలిసిందే. ‘SSMB29’ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తోంది. మ‌ల‌యాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ విల‌న్ పాత్ర‌లో న‌టించ‌నున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం సమకూర్చనున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత ఈ సినిమా వ‌స్తుండ‌టంతో పాటు మ‌హేశ్ బాబు(Mahesh Babu) , రాజ‌మౌళి కాంబోలో ఫ‌స్ట్ మూవీ కావ‌డంతో భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. కాగా, ఫారెస్ట్‌ అడ్వెంచరస్‌ యాక్షన్‌ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఒడిశాలో మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. తొలి షెడ్యూల్ పూర్తి కావడం, రెండో షెడ్యూల్‌కి కాస్త విరామం దొరకడంతో మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్లేందుకు రాజమౌళి (Rajamouli) పర్మిషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా ప్రారంభించినపుడు డైరెక్టర్ రాజ‌మౌళి మ‌హేశ్ బాబు పాస్‌పోర్ట్‌ని బందించినట్లు ఒక వీడియో రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. సింహాన్ని లాక్‌ చేసినట్లు అర్థంవచ్చేలా ఆ వీడియో ఉంది. పాస్‌పోర్ట్‌ చూపిస్తూ ఫొటోకు పోజ్‌ ఇచ్చారు.

రాజమౌళి (Rajamouli) పోస్ట్‌కు మహేశ్‌ స్పందించారు. ‘ఒక్కసారి కమిట్‌ అయితే నా మాట నేనే వినను’ అంటూ కామెంట్‌ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా మ‌హేశ్ బాబు ఎయిర్ పోర్ట్ లో తన పాస్‌పోర్ట్ తనకు మళ్ళీ వ‌చ్చిన‌ట్లు ఒక వీడియోను రిలీజ్ చేశాడు. ఇందులో సితార, నమ్రత, మహేశ్ బాబు కలిసి ఈ వెకేషన్‌కు వెళ్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది. కాగా రాజమౌళి – మహేశ్ బాబు (Mahesh Babu) ల కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అమెజాన్‌ అడవుల నేపథ్యంలో రూపొందనుండగా.. దీనికి రామాయణంలోని కొన్ని ఘట్టాలను స్ఫూర్తిగా తీసుకుని, మైథలాజికల్ గా తెరకెక్కించనున్నారని, ఈ కథ కాశీ నేపథ్యంలో సాగనుందని తెలుస్తోంది. ఇందులో హనుమంతుడి స్ఫూర్తితో హీరో క్యారెక్టర్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.