నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నటించిన చిత్రం ’కల్కి'(Kalki 2898 AD). అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె కీలక పాత్రలు పోషించారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ, రాజమౌళి లాంటి స్టార్స్ అతిథి పాత్రల్లో మెరిశారు. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. భారీ బడ్జెట్ తో వైజయంతి మూవీస్ నిర్మించిన ఈ సినిమా దాదాపు రూ.1200 కోట్లపైచిలుకు వసూళ్లు రాబట్టింది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్క్రిప్ట్ పనులలో బిజీగా ఉన్నారు. అయితే నాగ్ అశ్విన్, ప్రియాంక దత్ దంపతులు తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలోనే దర్శనం ముగించుకొని ఆలయ ప్రాంగణం నుంచి వెళ్తుండగా ‘కల్కి 2898 ఏడీ’ పార్ట్-2 అప్డేట్ గురించి అబిమానులు ఆయన్ని అడిగారు.
ఈ నేపథ్యంలో నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “చాలా కాలం తర్వాత శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉంది. తెలుగు సినీ పరిశ్రమ బాగుండాలని మొక్కుకున్నాను. ఇక ప్రభాస్ కల్కి2 సినిమా విషయనికొస్తే.. ఈ సినిమా మొదలవడానికి మరికొంత సమయం పడుతుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఇది పూర్తవగానే రెగ్యులర్ షూటింగ్ షూటింగ్ ప్రారంభిస్తాం.. నా అంచనా ప్రకారం ఈ ఏడాది చివరి నాటికి సెట్స్పైకి వెళ్లే అవకాశముంది” అని నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు. ఇక ఈ క్రేజీ సీక్వెన్స్ లో కర్ణుడిగా ప్రభాస్, అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ డెవిల్ యాస్కిన్గా కమల్హాసన్ కీలక పాత్రలు పోషించనున్నట్లు తెలుస్తోంది. కాగా, గతంలో ‘కల్కి’ చిత్ర నిర్మాతలు స్వప్న- ప్రియాంక ఈ సినిమా షూటింగ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ‘కల్కి'(Kalki) తో పాటే ఈ మూవీ సీక్వెల్కు సంబంధించి 35 శాతం షూట్ జరిగిందని తెలిపారు. ఇక కల్కి 2 సినిమాను కూడా వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ మరోసారి భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఇదిలాఉంటే. ప్రస్తుతం ప్రభాస్ (Prabhas) వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ‘ది రాజా సాబ్’ ‘ఫౌజీ’, ‘స్పిరిట్’ (Spirit) , ‘సలార్2’ వంటి చిత్రాలు ఈ జాబితాలో ఉన్నాయి.

