దర్శక ధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేశ్బాబుల కాంబినేషన్లో ఒక భారీ ప్రాజెక్ట్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ‘SSMB29’ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తోంది. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం సమకూర్చనున్నారు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ అల్యూమీనియం ఫ్యాక్టరీలో ప్రారంభమవగా.. తాజాగా ఈ షెడ్యూల్ ముగింపు దశకు చేరుకుందని తెలుస్తోంది.
ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రాతో పాటు ముఖ్య తారాగణంపై గత కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. మొదటి షెడ్యూల్ పూర్తవడంతో రెండో షెడ్యూల్ కోసం చిత్రబృందం ఆఫ్రికాకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆఫ్రికా వెళ్లడానికి ముందు రాజమౌళి హీరో మహేష్ బాబు, హీరోయిన్ ప్రియాంక చోప్రాతో కలిసి మీడియా సమావేశం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రెస్ మీట్ లో ‘SSMB29’ మూవీ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించబోతున్నారని తెలుస్తోంది.
నిజానికి రాజమౌళి తన సినిమాలను మొదలెట్టడానికి ముందే ప్రెస్ మీట్ పెడుతుంటాడు. కానీ, ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ముగిశాక ప్రెస్ మీట్ పెట్టనున్నాడు. హైదరాబాద్ లో ఏప్రిల్ మొదటి వారంలో ఈ ప్రెస్ మీట్ ఉంటుందని సమాచారం. ఇందులో ‘SSMB29’ సినిమాకు సంబంధించిన అన్ని వివరాలను రాజమౌళి వెల్లడించే అవకాశముంది. త్వరలోనే ఈ ప్రెస్ మీట్ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ‘SSMB29’ మూవీ టైటిల్ విషయంలో చిత్ర యూనిట్ సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ప్రారంభానికి ముందు గరుడ, మహారాజ్ లాంటి టైటిల్స్ వినిపించినప్పటికీ ఏది ఫిక్స్ కాలేదు. కాగా, అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు. అన్ని భాషల్లోనూ దీనిని రీమేక్ చేయనున్నారు. సినిమాలో మహేష్ తన కెరీర్లో ఇప్పటి వరకు చూడని కొత్త లుక్తో కనిపిస్తారని తెలుస్తోంది.

