అగ్ర కథానాయకుడు చిరంజీవి హీరోగా రూపొందుతున్న చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం చిరంజీవిపై ఇంట్రో సాంగ్ షూట్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటో కాదు, చిరు తమ్ముడు మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల ఈ సినిమాలో భాగమైనట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇందులో నిహారిక గెస్ట్ రోల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే చిరంజీవి మేనల్లుడు సాయదుర్గా తేజ్ ఈ మూవీలో కనిపించనున్నారని సమాచారం. ఇప్పటికే సాయిదుర్గా తేజ్ షూటింగ్లో కూడా పాల్గోన్నాడని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్కు ట్రిపుల్ ట్రీట్ అన్నట్లే. కాగా, సోషియో ఫాంటసీ జానర్లో ‘విశ్వంభర’ మూవీ రూపొందుతుంది. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ‘అంజి’ తర్వాత మెగాస్టార్ నుంచి ఈ జానర్లో వస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా త్రిష కథానాయికగా నటిస్తోంది. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కునాల్ కపూర్, అషికా రంగనాథ్, సురభి, ఇషా చావ్లా ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు.


