యువ హీరో సందీప్కిషన్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇటీవలే ‘ధమాకా’ మూవీ ఫేమ్ త్రినాథరావు దర్శకత్వంలో ‘మాజాకా’ అనే సినిమా చేయగా.. అది బాక్సఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. అయితే గోపీచంద్ హీరోగా ‘రామబాణం’ సినిమా తెరకెక్కించిన దర్శకుడు శ్రీవాస్ తో సందీప్ కిషన్ తన తదుపరి సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో సందీప్ కిషన్ హీరోగా సినిమా చేసేందుకు శ్రీవాస్ రంగం సిద్థం చేసుకున్నాడని తెలుస్తోంది. ఇటీవలే సందీప్ కిషన్ ను డైరెక్టర్ శ్రీవాస్ కలిసి ఓ కాన్సెప్ట్ చెప్పారని, అది బాగా నచ్చడంతో సందీప్ కిషన్ సినిమా చేయడానికి ఉత్సాహంగా ఉన్నారని ఫిల్మ్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది.
నిజానికి మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) కోసం దర్శకుడు శ్రీవాసు ఈ కథ సిద్ధం చేశారట. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించాల్సి ఉందట. మొదట స్క్రిప్ట్ విన్న రవితేజ దర్శకుడు శ్రీవాస్ కు వెంటనే ఓకే చెప్పాడని అంటున్నారు. అయితే శ్రీవాస్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలెట్టే సమయానికి రవితేజ ఈ సినిమా నుంచి తప్పుకున్నారట. రవితేజ అంతకుముందు పీపుల్స్ మీడియా నిర్మాణంలో ‘థమాకా’ లాంటి సూపర్ హిట్ సినిమా చేశాడు. కానీ ఈ బ్యానర్ లో గతేడాది రవితేజ చేసిన ‘ఈగిల్’, ‘మిస్టర్ బచ్చన్’ సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి. దాంతో రవితేజ ఈ బ్యానర్ లో దర్శకుడు శ్రీవాస్ తో సినిమా చేయకూడదనే ఉద్దేశ్యంతో తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అంతకుముందు హీరో సందీప్ కిషన్ (Sandeep Kishan) పీపుల్ మీడియా బ్యానర్ లో ‘ఎ 1 ఎక్స్ ప్రెస్’ సినిమా చేశాడు. ఇప్పడు ఆ అనుబంధం కారణంగానే దర్శకుడు శ్రీవాస్ తో సినిమా చేసేందుకు సందీప్ కిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

