తెలుగు చిత్ర సీమలో గత కొంతకాలంగా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా జోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రెండేళ్ల కిందటే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ‘వాల్తేర్ వీరయ్య’ తో పాటు ‘ఏజెంట్’, ‘బ్రో’, ‘స్కంద’ సినిమాల్లో ప్రత్యేక పాటల్లో నటించి అభిమానుల్ని ఆకట్టుకుంది. ఇటీవలే టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ మూవీలో దబిడి దిబిడి పాటలో కూడా ఊర్వశీ రౌతేలా అలరించింది. ఈ పాటలో ఆమె వేసిన స్టెప్పులపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే అందాల ముద్దుగుమ్మ గురించి ఇండస్ట్రీలో ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం యంగ్ టైగర్ ఎన్టీఆర్ – సలార్, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలో ఊర్వశీ రౌతేలా ఓ కీలక పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది. #NTRNeel అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే పూజ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్ లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీ తదుపరి షెడ్యూల్ లో ఊర్వశీ రౌతేలా చిత్రబృందంతో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో
సినిమాలోని ముఖ్య తారాగణంతో పాటుగా ఊర్వశీ రౌతేలాపై కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నట్లు సమాచారం. అయితే ఒకే ఏడాదిలో అటు బాబాయ్ బాలయ్యతో పాటుగా ఇటు అబ్బాయ్ ఎన్టీఆర్ తో కూడా నటించే అవకాశం దక్కించుకున్న ఊర్వశీ రౌతేలా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

