తమిళ యువ కథానాయకుడు ‘లవ్ టుడే’ మూవీ ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’. ‘ఓరి దేవుడా’ ఫేమ్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించగా.. కల్పాతి ఎస్.అఘోరం, కల్పాతి ఎస్.గణేశ్, కల్పాతి ఎస్. సురేష్ నిర్మాతలుగా వ్యవహరించారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రంలో కేఎస్ రవికుమార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్ వంటి అగ్ర దర్శకులు ముఖ్య పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కేవలం రూ. 35 కోట్లతో తెరకెక్కించిన డ్రాగన్ (Dragon) మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 150 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది. ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ మార్చి 14న హిందీలో రిలీజవగా అక్కడ కూడా కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది.
ఇక థియేటర్లో దుమ్మురేపిన ఈ మూవీ తాజాగా ఓటీటీ డేట్ లాక్ చేసుకుంది. దిగ్గజ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా మార్చి 21 నుంచి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించారు. ఈ క్రమంలోనే ప్రత్యేక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇదిలాఉంటే.. ఈ మూవీ హీరో ప్రదీప్ రంగనాథన్ ప్రస్తుతం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో ఉప్పెన ఫేం కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

