టాలీవుడ్లో కొన్ని సినిమాలుంటాయి. విడుదలై ఏళ్ళు గడిచినా చూసిని ప్రతి సారిగా కొత్తగా అలరిస్తూనే ఉంటాయి. అలాంటి చిత్రాల్లో ‘అతడు’ అగ్రస్థానంలో ఉంటుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మూవీ వచ్చి 16 ఏళ్ళు దాటినా ఇప్పటికి టీవీల్లో వస్తుందంటే అతుక్కుపోతుంటాం. ఇందులో స్టైలిష్ యాక్టింగ్తో అదరగొట్టేశాడు మహేశ్ బాబు (Mahesh Babu). కోలీవుడ్ భామ త్రిష హీరోయిన్గా నటించింది. ఇందులోని కథ, కథనం, డైలాగ్స్, నటీనటులు పర్ఫార్మెన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటేమిటీ ప్రతి సన్నివేశం అద్భుతమే. ఈ సినిమాలో ప్రతి పాత్రకు ఓ గుర్తింపు ఉంటుంది. అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది అతడు.
అయితే వెండితెరపై అదరగొట్టిన ఈ ఆల్టైమ్ ఎవర్గ్రీన్ సినిమా బుల్లితెరపై కూడా దుమ్మురేపుతోంది. ఈ క్రమంలోనే ‘అతడు’ ప్రపంచ రికార్డ్ సాధించింది. ‘అతడు’ సినిమా టీవీల్లో 1500సార్లు ప్రసారమై వరల్డ్ రికార్డ్ ఖాతాలో వేసుకుంది. పాపులర్ టీవీ ఛానెల్ స్టార్ మా (Star Maa) ఛానెల్లో ఈ మూవీ ఇప్పటి వరకూ 1500సార్లు టెలి క్యాస్ట్ అయింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా టీవీల్లో అత్యధికసార్లు ప్రసారమైన సినిమాగా అతడు అరుదైన రికార్డ్ సృష్టించింది. దింతో తమ హీరో ప్రపంచ రికార్డ్ సాధించడంపై మహేశ్ బాబు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలాఉంటే.. అతడు సినిమా నిర్మాణం కోసం 2005లోనే రూ.23 కోట్లకు పైగా ఖర్చు చేశారు. దాంతో బిజినెస్ పూర్తిగా కాలేదు. 16 కోట్లకు మాత్రమే సినిమాను అమ్ముకున్నాడు ప్రొడ్యూసర్ మురళీ మోహన్. అయితే థియేట్రికల్ కలెక్షన్స్ మాత్రం ఉహించని స్థాయిలో వచ్చాయి. 2005, ఆగస్టు 10న విడుదలైన అతడు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తు బాక్సఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. ఇక అతడు మూవీని స్టార్ మా సంస్థ రూ. 5 కోట్లకు కొని ఆ తర్వాత రూ.7 కోట్లకు దాన్ని రెన్యువల్ చేయించుకున్నారు. ఆ తర్వాత అలా కొనసాగుతూనే ఉంది. టీవీలో ప్రసారమైన ప్రతీసారి కూడా అతడు మూవీ అదిరిపోయే రేంజులో టీఆర్పీ సాధించడం విశేషం

