దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్బాబల కాంబినేషన్లో ఒక భారీ ప్రాజెక్ట్ రూపొందనున్న సంగతి తెలిసిందే. ‘SSMB29’ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తోంది. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం సమకూర్చనున్నారు. అయితే, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఒడిషాలోని
కోరాపుట్ అటవీ ప్రాంతంలో
కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ షూటింగ్కి సంబంధించి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో లీకయింది. ఈ వీడియోలో మహేశ్ బాబు నడుచుకుంటూ వచ్చి వీల్ చైర్లో ఉన్న అతడిముందు మోకాలిపై ఉన్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.
అంతకుముందు రాజమౌళి రూపొందించిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలకు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు లీక్ అయ్యాయి. అందుకే ఈసారి అలాంటి తప్పులు జరగకుండా ఉండేందుకు గాను ఈ సినిమా కోసం పని చేస్తున్న ప్రతిఒక్కరితోనూ రాజమౌళి నాన్ డిస్క్లోజ్ అగ్రిమెంట్లను చేసుకున్నారు. అయినా కూడా వీడియో బయటికి రావడంపై రాజమౌళి ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. కాగా, ఈ సినిమాలో మహేశ్ బాబు పేరు ‘రుద్ర’ అని తెలుస్తోంది. మహేశ్ కెరీర్లోనే విభిన్నమైన పాత్రగా ‘రుద్ర’ నిలుస్తుందని ఇన్సైడ్ టాక్. మహేశ్ బాబును ‘రుద్ర’గా అత్యంత శక్తివంతమైన పాత్రలో ఆవిష్కరిస్తూ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా డైరెక్టర్ రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఒడిశాలోని కోరాపుట్ అటవీ ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. ఇందులో కీలక పాత్ర పోషించబోతున్న మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, మహేశ్ బాబుల మీద ఇక్కడి అడవుల్లో కీలక యాక్షన్ ఘట్టాలను తెరకెక్కించబోతున్నారని సమాచారం. కాగా, అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో ఇంకా హాలీవుడ్కి చెందిన పలువురు నటులు భాగం కానున్నారు.

