టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘బాపు’(Bapu) ‘ఏ ఫాదర్స్ సూసైడ్ స్టోరీ’ ఉపశీర్షిక. దయా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాకు ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందించగా అథీరా ప్రొడక్షన్స్, కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సంస్థ సంయుక్తంగా నిర్మించాయి. కాగా, ఈ సినిమాలో ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. తెలంగాణ గ్రామీణ వాతావరణంలో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందన అందుకుంది.
ఈ క్రమంలోనే థియేటర్లోకి వచ్చిన రెండు వారాలకే ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది ‘బాపు’. ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ జియోహాట్స్టార్లో (Jio Hotstar) ఈ సినిమా మార్చి 7 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ మూవీని రైతుల ఆత్మహత్య నేపథ్య కథతో తెరకెక్కించారు. ఈ సినిమా ఎక్కువ మందికి చేరాలనే ఉద్దేశ్యంతో నిర్మాతలు ఈ మూవీని సింగిల్ స్క్రీన్స్ లో మల్టీప్లెక్స్ లలో తక్కువ చార్జీలకే ప్రదర్శించారు. ఏదేమైనా విడుదలైన రెండు వారాలకే ఇలా సినిమాని ఓటీటీలోకి తీసుకురావడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

