గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ‘ఆర్సీ16’ వర్కింగ్ టైటిల్ తో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. కాగా, కుస్తీతో పాటు క్రికెట్ బ్యాక్గ్రౌండ్లో ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. అయితే, తాజాగా ‘ఆర్సీ16’ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది.
తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోండగా.. ఇటీవలే హైదరాబాద్లో ఓ కీలక షెడ్యూల్ పూర్తయింది. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్, దివ్యేందులపై క్రికెట్ బ్యాగ్డ్రాప్ సీన్స్ షూట్ చేశారు. ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ మార్చి ఫస్ట్ వీక్ నుంచి ఢిల్లీలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో రామ్చరణ్ (Ram Charan) తో పాటు ఇతర ముఖ్య నటులపై కుస్తీ బ్యాగ్డ్రాప్ సీన్స్ షూట్ చేయనున్నట్లు సమాచారం. అయితే ఇదే షెడ్యూల్ లో భాగంగా కొన్ని కీలక సన్నివేశాలను కాకినాడలో కూడా చిత్రీకరించనున్నారని సమాచారం. కాకినాడ సమీపంలో ఉప్పాడ బీచ్ దగ్గర ఈ సన్నివేశాలను షూట్ చేయనున్నట్లు సమాచారం. ఈ బీచ్ సీన్స్ ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వస్తాయని తెలుస్తోంది. ఏదేమైనా బుచ్చిబాబు స్వస్థలమైన కాకినాడ ఉప్పాడ బీచ్ ను మరోసారి తన సినిమాలో చూపించనున్నాడు. అంతకుముందు తన మొదటి సినిమా ‘ఉప్పెన’లో అగ్ర భాగం షూటింగ్ ఉప్పాడ సమీపంలోనే షూట్ చేసిన సంగతి తెలిసిందే. మళ్లీ రెండో సినిమా కోసం కూడా అదే బీచ్ బ్యాగ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని మూవీ షూట్ చేయనున్నాడు.
ఇదిలాఉంటే, మార్చి 27న రామ్చరణ్ (Ram Charan) బర్త్ డే కానుకగా టైటిల్, టీజర్ రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ (Jahnavi Kapoor) హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండగా.. రత్నవేలు సినిమాటోగ్రాఫర్గా ఉన్నారు.

