యుగానికి ఒక్కడు’ రీ రిలీజ్‍ డేట్ ఇదే.. సీక్వెల్‌లో బిగ్ ట్విస్ట్!

by | Feb 23, 2025 | సినిమా

సినీ ప్రియులను అలరించిన చిత్రాల్లో ఆయిరత్తిల్‌ ఒరువన్‌ (యుగానికి ఒక్కడు) ముందు వరుసలో ఉంటుంది. కోలీవుడ్‌ హీరో కార్తీతో పాటు ఆండ్రియా, రీమాసేన్‌ కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. విజువల్‌ వండర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రానికి  సెల్వరాఘవన్‌ దర్శకత్వం వహించారు. 2010లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించింది. తమిళంలో కంటే తెలుగులోనే ఈ సినిమా మంచి విజయం సాధించింది. ‘రేయ్ ఎవర్రా మీరంతా’ అంటూ కార్తీ పలికిన డైలాగ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే, తాజాగా ఈ చిత్రం రీ రిలీజ్‍ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. 

ఇటీవల పలు సూపర్ హిట్ చిత్రాలను రీ రిలీజ్‌ చేసే ట్రెండ్‌ ఇండస్ట్రీలో నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే యుగానికి ఒక్కడు మూవీని మరోసారి బిగ్‌ స్క్రీన్‌పై చూసే అవకాశం అభిమానులకి దక్కనుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ డ్రీమ్ వ్యాలీ కార్పొరేషన్ బ్యానర్‌ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. 15 ఏళ్ల తర్వాత చోలాస్ మళ్లీ తిరిగి వస్తున్నారని వారు ఒక పోస్టర్‌ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, అమెరికాలో మార్చి 14న ‘యుగానికి ఒక్కడు’ థియేటర్లలో సందడి చేయనుందని పోస్ట్ చేశారు. దీంతో కార్తీ ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు ‘యుగానికి ఒక్కడు’ మూవీ సీక్వెల్‌పై ఇప్పటికే అనౌన్స్మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. దర్శకుడు సెల్వ రాఘవన్‌ ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్న ఈ చిత్రంలో ధనుష్‌ హీరోగా నటించనున్నాడు. ప్రస్తుతం ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం.