స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం ఒక భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఆయన గత సినిమాలైన లైగర్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తెలిపోవడంతో ఈసారి ఎలాగైనా భారీ హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని చూస్తున్నారు. అయితే.. పూరీ తర్వాతి సినిమా ఏ హీరోతో అనేది మాత్రం ఇప్పటివరకూ క్లారిటీ లేదు. అయితే.. తాజాగా ఈ విషయంపై ఓ వార్త చక్కర్లు కొడుతోంది. పూరీ జగన్నాథ్ నెక్ట్స్ సినిమా గోపీచంద్తో ఉంటుందట. పూరీ, గోపీచంద్ కలిసి 2010లో ‘గోలీమార్’ సినిమా చేశారు. ప్రియమణి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను.. బెల్లంకొండ సురేష్ బాబు నిర్మించాడు. 2010లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సఫీస్ వద్ద బంపర్ హిట్ గా నిలిచింది. పోలీస్, మాఫీయా బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ చిత్రంలో గంగారాం అనే పోలీస్ పాత్రలో ఆకట్టుకున్నాడు గోపిచంద్. అయితే ఈ మూవీ విడుదలైన 15 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
‘గోలీమార్’ సీక్వెల్ ప్రాజెక్ట్కు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయినట్లు తెలుస్తుంది. గోపిచంద్ కూడా ఈ ప్రాజెక్ట్పై ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ కి ప్రస్తుతం కసరత్తులు జరుగుతున్నట్లు సమాచారం. మే నెలలో రెగ్యులర్ షూటింగ్ని మొదలుపెట్టనున్నారట పూరీ జగన్నాథ్. తొలి షెడ్యూల్లో గోపిచంద్ పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారట. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ సినిమా విడుదల ఉంటుందట. అలాగే ఈ సినిమాలో గోపిచంద్ కు జోడీగా శ్రీలీలను తీసుకున్నట్లు సమాచారం. స్క్రిప్ట్ నచ్చడంతో శ్రీలీల ఈ సినిమాలో నటించేందుకు సైన్ కూడా చేసినట్టు టాలీవుడ్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను కూడా బెల్లంకొండ సురేష్ నిర్మించబోతున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు గోపీచంద్ ఘాజీ ఫేం సంకల్ప్ రెడ్డితో సినిమా చేయనున్నారని కొన్నిరోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

