బాలీవుడ్ యువ కథానాయకుడు విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఛావా’. ఇందులో రష్మిక మందన్నా కథానాయికగా నటించగా.. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించాడు. మహరాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ కొడుకు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా వచ్చింది. విక్కీ కౌశల్ ఇందులో శంభాజీ మహరాజ్ పాత్ర పోషించగా.. ఆయన భార్య యెసుబాయ్ పాత్రను రష్మిక మందన్నా పోషించారు. ఇక ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్తో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ ను గీతా ఆర్ట్స్ సంస్థ విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ పతాకంపై మార్చి 7 నుంచి ‘ఛావా’ తెలుగు వెర్షన్ ప్రేక్షకులకు అందుబాటులో రానుంది. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు ట్రైలర్తో ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెంచేందుకూ చిత్ర యూనిట్ సిద్ధమయ్యారు.
‘ఛావా’ తెలుగు వెర్షన్ ట్రైలర్ను మార్చి 3న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించారు. దీంతో ఈ సినిమా తెలుగు ట్రైలర్ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.
కాగా, శివాజీ సావంత్ రాసిన ‘ఛావా’ ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కగా.. గతేడాది ‘స్త్రీ-2’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దినేశ్ విజాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో మొఘల్ రాకుమారి పాత్రలో డయానా పింటీ, ఔరంగజేబ్ పాత్రలో అక్షయ్ ఖన్నా నటించగా.. ఎ.ఆర్.రహమాన్ సంగీతం అందించారు.

