తండేల్  మూవీ రివ్యూ : ఇండియా లో ప్రేమికుడు – పాకిస్థాన్ లో నాయకుడు

by | Feb 7, 2025 | సినిమా రివ్యూ

సినిమా                        : తండేల్

మార్కులు                   : 50/100

విడుదల తేదీ              : 07-02-2025

నిర్మాణ సంస్థ              : గీతా ఆర్ట్స్

నటీ నటులు                : నాగ చైతన్య, సాయి పల్లవి

సంగీతం                      : దేవి శ్రీ ప్రసాద్ 

నిర్మాత                        : బన్నీ వాస్

రచన & దర్శకత్వం    : చందూ మొండేటి

కధ

మత్స్య కారుల జీవితాలకు సంబంధించిన కధ.  నాయకుడిగా ఎదిగిన ఓ మత్సకారుడి ప్రేమ కధ

బలాలు 

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం (బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు)

నాగ చైతన్య మరియు సాయి పల్లవి ల నటన

బలహీనతలు

బలహీన మైన కధ, కధనాలు

నెమ్మదిగా సాగే ఫస్ట్ హాఫ్

బలంగా లేని భావోద్వేగాలు

వినోదం లేక పోవడం

పాకిస్థాన్ ఎపిసోడ్ – అనవసర, అసహజ సన్నివేశాలు

రెండవ భాగంలో సాయి పల్లవి క్యారెక్టర్ ను బలహీనంగా రాయడం

విశ్లేషణ

తండేల్ సినిమా, సత్య (సాయి పల్లవి) తన లవ్ స్టోరీ చెప్పడంతో మొదలవుతుంది. సినిమా మొదటి భాగమంతా చిన్న, చిన్న ఫీల్ గుడ్, ప్రేమ సన్నివేశాలతో అల్లేశాడు దర్శకుడు.  9 నెలలు వేటకు వెళ్లడం, 3 నెలలు ఊరికి రావడం అన్న అంశాల చుట్టూ రాజు, సత్య ల ప్రేమ తిరుగుతుంది.  మత్సకారుడి వేట కన్నా ప్రేమ సన్నివేశాలే ఎక్కువ ఉంటాయి మొదటి భాగంలో

మత్సకారుడిని వేటకు వెళ్లొదనే ప్రేమ, దానికి గల కారణాలు అంత ఆకట్టుకునేలా లేవు. ఇంటర్వెల్ ముందు సముద్రం మీద తీసిన 10 నిమిషాల సన్నివేశాలు పరవాలేదనిపించాయి

మొదటి భాగం కధ ఇండియా లో జరిగితే, రెండవ భాగం కధ పాకిస్థాన్ లో జరుగుతుంది.  ముగింపు సన్నివేశాలు ఇండియా లోనే.

మత్సకారుడి ప్రేమ కధ, రెండవ అర్ధభాగం లో పాకిస్థాన్ కు షిఫ్ట్ అవుతుంది.  ఇక్కడే దర్శకుడు సినిమా సోల్ ని గాలికి వదిలేశాడు.  పాకిస్థాన్ లో హీరో ప్రదర్శించే దేశ భక్తి మీద ఎక్కువ దృష్టి పెట్టాడు దర్శకుడు. ‘

రెండవ అర్ధ భాగంలో సాయి పల్లవి క్యారెక్టర్ ని చాల వీక్ గా, అసహజం గా  రాశారు.  పాకిస్థాన్ జైలు లో ఎపిసోడ్ లు అంత ఎంగేజింగ్ గా లేవు 

కరాచీ పోలీస్ నేరుగా సాయి పల్లవి కి ఫోన్ చేయడం, సుశీల స్వరాజ్ సెక్రటరీ సాయి పల్లవికి ఫోన్ చేయడం, పాకిస్థాన్ చేతి కి  చిక్కిన మత్సకారులను విడిపించడానికి  సాయి పల్లవి నేరుగా విదేశాంగ శాఖ మంత్రి ని, ఢిల్లీ వెళ్లి కలవడం, పాకిస్థాన్ జైలు లో దేశ భక్తి ని తెలియచేసే అనవసర  హీరోయిజం సన్నివేశాలు విసుగు తెప్పిస్తాయి.  ఆఖరిలో ఆధార్ కార్డు అవసరం గురించి చెప్పారండోయ్.

ప్రేమ కధ ని, దేశ భక్తి తో ముడి పెట్టిన సీతారామం సినిమాలో లాగా సహజమైన, బలమైన భావోద్వేగాలు పండలేదు. సాయి పల్లవి లాంటి నటిని పెట్టుకుని,  పూర్ రైటింగ్ తో, రెండవ అర్ధభాగంలోసినిమా గాడి తప్పింది.

ఈ సినిమాని కేవలం నాగ చైతన్య, సాయి పల్లవి ల నటన, దేవి శ్రీ ప్రసాద్ అందించిన అద్భుతమైన నేపధ్య సంగీతం కాపాడాయి అని చెప్పవచ్చు.  అందరికంటే ముందు దేవి శ్రీ ప్రసాద్ ని అభినందించవచ్చు.  చిన్న, చిన్న సన్నివేశాలను, కేవలం తన నేపధ్య సంగీతం తో పైకి లేపాడు. 

నాగ చైతన్య, సాయి పల్లవి ల నటన, దేవి శ్రీ ప్రసాద్ నేపధ్య సంగీతం తండేల్ ని బతికించాలి. ఒక వారం పాటు పరవాలేదు. వచ్చేవారం లైలా, చావా చిత్రాలు వస్తున్నాయి.  పోటీ తట్టుకుని ఎలా నిలబడుతుందో చూడాలి

చివరగా ఇండియా లో ప్రేమికుడు – పాకిస్థాన్ లో నాయకుడు