ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం ‘పుష్ప 2 ది రూల్’. పుష్ప పార్ట్ 1 సినిమాకి సీక్వెల్గా వచ్చిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించాడు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కింది. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా టాలీవుడ్తో పాటు బాక్సాఫీస్ వద్ద అన్ని రికార్డులను బ్రేక్ చేసి ఇటీవల సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా రూ. 1871 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. అయితే పుష్ప 2 సినిమాకు మరో సీక్వెల్గా పుష్ప -3 (Pushpa) ఉంటుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే పుష్ప 3 ఎప్పుడుంటుందనే విషయాన్ని తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ రవిశంకర్ వెల్లడించారు.
తాజాగా విజయవాడలో జరిగిన నితిన్ ‘రాబిన్హుడ్’ ప్రమోషన్స్లో రవిశంకర్ ‘పుష్ప 3’ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘పుష్ప 3: ది ర్యాంపేజ్’ గా తెరకెక్కనున్న ఈ సినిమాను 2028లో విడుదల చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ డైరెక్టర్ అట్లీతో చేస్తున్న సినిమాతో బిజీగా ఉన్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా, ‘పుష్ప’ (Pushpa) ఫ్రాంచైజీలో భాగంగా 2021లో ‘పుష్ప ది రైజ్’ తెరకెక్కింది. 2021 డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రూ.350 కోట్లకు పైగా వసూలు చేసింది. అనంతరం దీనికి సీక్వెల్ గా పుష్ప-2 తెరకెక్కగా.. 2024 డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.1871 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది. కాగా, పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన్నా నటించగా.. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. దేవీ శ్రీ ప్రసాద్, అద్భుతమైన మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో ఫహద్ ఫాసిల్, రావు రమేష్, జగపతి బాబు, అజయ్, అనసూయ భరద్వాజ్, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. కాగా, ప్రస్తుతం ఈ మూవీ నెట్ఫ్లిక్స్ వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.

