టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం ‘మాస్ జాతర’ మనదే ఇదంతా’ ట్యాగ్లైన్. సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నరన్న సంగతి తెలిసిందే. ‘సామజవరగమన’ రచయిత భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రవితేజ హీరోగా గతేడాది వచ్చిన ఈగల్, మిస్టర్ బచ్చన్ చిత్రాలు బాక్సఫీస్ వద్ద నిరాశపరిచాయి. దాంతో ప్రస్తుతం రవితేజ ఆశలన్నీ ఈ చిత్రంపైనే ఉన్నాయి. రవితేజకు జోడిగా శ్రీలీల ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. మాస్ జాతర చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇదివరకే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వేసవి కానుకగా మే 9న విడుదల కానుంది.
అయితే ఇటీవలే మే 9న పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ రాబోతోందనే ప్రకటన వెలువడింది. దాంతో ‘మాస్ జాతర’ మూవీ వాయిదా పడక తప్పదని తేలిపోయింది. తాను మొదట ఫిక్స్ చేసుకున్న తేదీని పవన్ కళ్యాణ్ కు ఇచ్చేసి.. రవితేజ మరింత వెనక్కి వెళుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ‘మాస్ జాతర’ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. చిత్ర బృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా… జూలై 18న ‘మాస్ జాతర’ వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే మేకర్స్ అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ లో భాగంగా ఇందులోని ‘తూ మేర లవర్..’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ను ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్లు పోస్టర్ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో రవితేజ అమ్మాయిలతో ఆడిపాడుతున్నాడు. ఈ సినిమాలో రవితేజ సూపర్ హిట్ ఇడియట్ మూవీలో ‘చూపులతో గుచ్చి గుచ్చి చంపకే’ సాంగ్ ను ఇందులో రీమిక్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో రవితేజ, రాజేంద్రప్రసాద్ తాతామనవళ్లుగా నటిస్తున్నారని తెలుస్తోంది.

