కాంతార’తో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేసిన కన్నడ స్టార్ హీరో రిషభ్ శెట్టి ‘జై హనుమాన్’ (Jai Hanuman) చిత్రంలో ఆంజనేయస్వామి పాత్రలో అలరించనున్న సంగతి తెలిసిందే. యువ కథానాయకుడు తేజా సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prashanth Varma) తెరకెక్కించిన ‘హనుమాన్’ మూవీ సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే.. దీనికి సీక్వెల్గా ‘జై హనుమాన్’ చిత్రాన్ని ప్రకటించారు యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇందులో ప్రధాన పాత్రలో రిషబ్ శెట్టి (Rishab Shetty) కనిపించనున్నారు. ఈ సినిమాను ప్రకటించి చాలా రోజులే అయింది. దీనికి సంబంధించి రిషబ్ లుక్ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. కానీ ఇంకా సినిమా ప్రారంభం కాలేదు. అయితే రిషబ్ బిజీగా ఉండటం, డేట్స్ కుదరక ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకి వెళ్లలేదని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ యాక్టర్ ఒకరు కామియో రోల్లో కనిపించబోతున్నాడన్న వార్త ఇండస్ట్రీ సర్కిల్లో హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో తెలుగు హీరో రానా దగ్గుబాటి (Rana Daggupaati) కీలక పాత్రలో నటించనున్నాడని ఇన్సైడ్ టాక్. ఈ సినిమాలోని కీలక పాత్ర కోసం చిత్రబృందం రానాను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. పాన్ ఇండియా సినిమా కావడంతో రానా దగ్గుబాటి కూడా మరో మాట లేకుండా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతానికి దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఏం రాకున్నా.. ఈ న్యూస్ను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు. ఇక ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకకు కూడా ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 22న ఆధ్యాత్మిక, చారిత్రక ప్రదేశమైన హంపిలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ఘనంగా ప్రారంభించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి నెల నుంచి ప్రారంభం కానుండగా.. రిషబ్ శెట్టి వరుసగా ఐదారు నెలలు ప్రశాంత్ వర్మకి కాల్షీట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది శుభవార్తే అవుతుంది. కాగా, ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుండటం విశేషం. ఈ మూవీని 2027లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

