టాలీవుడ్ లో తనదైన నటనతో కోట్లాదిమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) . తన సినీ జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలని చూసిన చిరంజీవి ఈ రోజు ప్రజల గుండెల్లో దేవుడిగా మారాడు. నటుడిగానే కాదు సామాజిక సేవకుడిగా కూడా అందరి మనసులు గెలుచుకున్నాడు చిరు. 1978లో పునాదిరాళ్లు సినిమాతో నటుడిగా అరంగేట్రం చేసిన మెగాస్టార్ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో విభిన్న పాత్రలలో నటించి తెలుగు ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా ఎదగడమే కాకుండా ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా రికార్డు కూడా సృష్టించాడు. ఆయనకి మన ఇండియాలోనే కాదు విదేశాలలోను భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒకప్పుడు మెగాస్టార్ సినిమా విడుదల అవుతుందంటే చాలు అభిమానులతో పాటు సినీ ప్రేమికులు థియేటర్ల ముందు క్యూ కట్టేవారు. 1978లో వచ్చిన పునాదిరాళ్లు సినిమాతో చిరంజీవి నటప్రస్థానం మొదలైంది. ` పునదిరాళ్లు చిత్రంలో నటించి నటుడిగా మారిన చిరంజీవి ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. మెగాస్టార్గా ఐదు దశాబ్దాలుగా ఇండస్ట్రీని ఏలుతున్నారు. అయితే తన సినీ జీవితానికి పునాది వేసిన తొలి సినిమాను తాజాగా గుర్తు చేసుకున్నారు చిరంజీవి. (Chiranjeevi)
ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ.. ‘ఫిబ్రవరి 11, ఈరోజు “పునాదిరాళ్లు” సినిమా కోసం జీవితంలో కెమెరా ముందు నిలిచిన తొలి రోజు. ఆ రోజు నాలో కలిగిన ఆతృత, ఆనందం, బాధ్యత, భావోద్వేగం మాటల్లో వర్ణించలేను. ఆ క్షణం ఇప్పటికీ నిన్న, మొన్న జరిగిందేమో అన్నట్టు అనిపిస్తుంది. ఒక అందమైన చందమామ కథ లాంటి అనుభూతి. నట జీవితానికి పునాది రాళ్లుఈ ప్రత్యేక సందర్భంలో, నాకు ఆ తొలి అవకాశం ఇచ్చిన ఆ చిత్ర దర్శక, నిర్మాతలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారి నమ్మకం, ప్రోత్సాహంతో వచ్చిన అవకాశంతో నటనలో నా ప్రయాణానికి పునాది రాళ్లు పడ్డాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ నన్ను ఆదరిస్తూ, ఆశీర్వదిస్తున్న ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు” అని ట్వీట్ చేశారు. తన మొదటి సినిమా షూటింగ్ సమయంలో దిగిన ఫోటోలను ఈ పోస్ట్కు జత చేశారు చిరు. మెగాస్టార్ (Mega Star Chiranjeevi) చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

