సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajanikanth) కథానాయకుడిగా నటించిన బాలీవుడ్ చిత్రం ‘హమ్ మేన్ షాహెన్షా కౌన్’ 37 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు రానుంది. 1989లోనే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో రజనీకాంత్, శత్రుఘ్న సిన్హా, హేమా మాలిని, అనితా రాజ్ , ప్రేమ్ చోప్రా, అమ్రిష్ పూరి, శరత్ సక్సేనా, శరద్ సక్సేనా వంటి అగ్ర నటులు భాగమయ్యారు. ఈ చిత్రానికి దర్శకుడుగా ఉన్న హర్మేష్ మల్హోత్రా ఇప్పటికే మరణించగా… భారీ వ్యయంతో రాజారాయ్ ఫిలిమ్స్ బ్యానర్ పై రాజారాయ్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీత ద్వయం లక్ష్మీకాంత్, ప్యారేలాల్ మ్యూజిక్ అందించగా.. డైలాగ్స్ను సలీం, ఫైజ్ రాశారు. అయితే ఈ సినిమా ప్రొడ్యూసర్ రాజారాయ్ చిత్రీకరణ పూర్తయ్యాక అనుకోని కారణాల వల్ల లండన్కు వెళ్లిపోయాడు.. ఆ తర్వాత అతని కొడుకు మరణించారు. దాంతో ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు.
ఇలా ఎన్నో కారణాలతో వాయిదా పడిన ఈ చిత్రం.. ఇప్పుడు ఆధునాతన టెక్నాలజీతో ‘హమ్ మేన్ షాహెన్షా కౌన్ టైటిల్’తోనే ఈ ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ లో విడుదల కానుంది. ఈ మూవీ పిక్చర్ క్వాలిటీతో పాటు సౌండ్ కోసం ఏఐ టెక్నాలజీని ఉపయోగించినట్లు మేకర్స్ వెల్లడించారు. ఏదేమైనా ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమా విడుదల కానుండడంతో అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. మరి దిగ్గజ నటీనటులు భాగమైన ఈ చిత్రం వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తుందన్నది చూడాలి. కాగా, ఈ సినిమా హీరో రజనీకాంత్ ప్రస్తుతం ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ 2 చేస్తుండగా… శిబి చక్రవర్తి దర్శకత్వంలో ‘తలైవా- 173’ మూవీ చేయనున్నారు.


