నట దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కింగ్ నాగార్జున తనదైన నటనతో మూడు దశాబ్దాలుగా అక్కినేని నట వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. రొమాంటిక్, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్, భక్తి చిత్రాలు ఇలా విభిన్న చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. ఈ క్రమంలోనే నాగార్జున ఇప్పుడు తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి కోలీవుడ్ దర్శకుడు రా. కార్తీక్ (Ra Karthik) దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోండగా.. నాగ్ ఈ సినిమాలో పూర్తిగా కొత్త లుక్లో కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమా ఏ జానర్లో రూపొందుతోందన్న విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఇందులో కథాపరంగా మాత్రం నాగార్జున మూడు విభిన్న పాత్రల్లో కనిపిస్తారని, ముగ్గురు హీరోయిన్లు ఉంటారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే ఈ సినిమాలో ఓ కథానాయికగా టబు (Tabu) నటిస్తోందని తెలిసిందే. గతంలో నాగార్జున – టబు కాంబోలో వచ్చిన ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడా మా ఆవిడే’ సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. అలాగే ఈ సినిమాలో మరో కథానాయికగా ‘నాట్యం’ ఫేమ్ సుస్మితా భట్ నటించనుందని సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios) సమర్పణలో మనం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగార్జున (Nagarjuna) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం. ‘కింగ్ 100’ (King 100_ అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘100నాటౌట్’ ‘లాటరీ కింగ్’ అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. కొన్నాళ్లుగా సరైన సక్సెస్ అందుకోలేకపోయిన నాగార్జున ఈ సినిమాతో భారీ హిట్ కొట్టాలని భావిస్తున్నారు. ఈ ఏడాది దసరా కానుకగా సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

