బాలీవుడ్ లో ‘ఉరి: ద సర్జికల్ స్ట్రైక్’ వంటి సూపర్ హిట్ తర్వాత దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి విధ్వంసం సృష్టించింది.
ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతూ రికార్డులు సృష్టిస్తున్న అవుతోన్న దురంధర్ 22 దేశాలలో ట్రెండ్ అవుతున్నట్లుగా నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. అంతే కాకుండా నెట్ ఫ్లిక్స్ లో నాన్ ఇంగ్లీష్ సినిమాల విభాగంలో గ్లోబల్ గా నెంబర్ వన్ స్థానంలో దురంధర్ నిలిచినట్లుగా నెట్ ఫ్లిక్స్, జియో స్టూడియో వారు ప్రకటించారు
ధురంధర్ తొలి పార్ట్ అటు థియేటర్లతో పాటుగా ఇటు ఓటీటీలో కూడా అద్భుత విజయాన్ని సాధించడంతో సీక్వెల్ మీద అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. ‘ధురంధర్ 2’ (Durandhar) సినిమాను ఈ ఏడాది మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు మేకర్స్.
జియో స్టూడియోస్ మరియు B62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ యాక్షన్ స్పై ఎంటర్టైనర్లో బాలీవుడ్ అగ్ర కథానాయకుడు రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ వంటి అగ్ర తారాగణం కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
‘ధురంధర్ 2’ ఓటీటీ రైట్స్ను భారీ మొత్తానికి జియో హాట్స్టార్ (Jio Hot Star) సొంతం చేసుకోగా.. ధురంధర్2 సీక్వెల్ జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. అంతకుముందు ఫస్ట్ పార్ట్ దిగ్గజ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్లో (Netflix) స్ట్రీమింగ్ కాగా, ఇప్పుడు రెండో భాగానికి ఓటీటీ పార్ట్నర్ను ఎందుకు మార్చారన్నది ఆసక్తికరంగా మారింది.


