బాలీవుడ్ లో ‘ఉరి: ద సర్జికల్ స్ట్రైక్’ వంటి సూపర్ హిట్ తర్వాత దర్శకుడు ఆదిత్య ధర్ (Aditya Dhar) తెరకెక్కించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి విధ్వంసం సృష్టిస్తోంది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతూ రికార్డులు సృష్టిస్తున్న ఈ సినిమాకు రెండో భాగం ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. ఈ క్రమంలోనే ‘ధురంధర్ 2’ మూవీ సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలి పార్ట్ అటు థియేటర్లతో పాటుగా ఇటు ఓటీటీలో కూడా అద్భుత విజయాన్ని సాధించడంతో సీక్వెల్ మీద అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. తాజాగా ‘ధురంధర్ 2’ (Durandhar 2) మూవీ టీజర్ (Teaser) ను ఈరోజు మధ్యాహ్నం 12:12 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన అఫీషియల్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇందులో ఓ ఆసక్తికర విషయం గమనించవచ్చు. ఈ సెకండ్ పార్ట్ ఓటీటీ రైట్స్ను భారీ మొత్తానికి జియో హాట్స్టార్ (Jio Hot Star) సొంతం చేసుకోగా.. ధురంధర్2 సీక్వెల్ జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. అంతకుముందు ఫస్ట్ పార్ట్ దిగ్గజ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్లో (Netflix) స్ట్రీమింగ్ కాగా, ఇప్పుడు రెండో భాగానికి ఓటీటీ పార్ట్నర్ను ఎందుకు మార్చారన్నది ఆసక్తికరంగా మారింది.
కాగా, జియో స్టూడియోస్ (Jio Studios) మరియు B62 స్టూడియోస్ (B62 Studios) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ యాక్షన్ స్పై ఎంటర్టైనర్లో బాలీవుడ్ అగ్ర కథానాయకుడు రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ (Sara Arjun) వంటి అగ్ర తారాగణం కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ రైట్స్ను టీ సిరీస్ సంస్థ భారీ ధరకు దక్కించుకోగా.. టీజర్ను కూడా టీ సిరీస్ (T Series) అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్లోనే రిలీజ్ చేయనున్నారు. ఇక ‘ధురంధర్ 2’ సినిమాను ఈ ఏడాది మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

