మెగా ఫ్యాన్స్ రెడీనా.. హై ఓల్టేజ్‌తో ‘విశ్వంభర’ ట్రైలర్

by | Feb 16, 2026 | సినిమా

మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) , అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబోలో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా సూపర్ హిట్ టాక్ తో ఈ ఏడాది సంక్రాంతి విన్నర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇదే ఉత్సాహంతో ఇప్పుడు చిరు తదుపరి చిత్రాలపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. చిరంజీవి లైనప్‌లో ఉన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘విశ్వంభర’ (Viswambhara) దర్శకుడు వశిష్ఠ (Vasista) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో త్రిష (Trisha) హీరోయిన్‌గా నటిస్తుండగా, యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు వశిష్ఠ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా, కథా పరంగా విజువల్ పరంగా కొత్త అనుభూతిని అందిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. అయితే ఈ మూవీ టీజర్‌ రిలీజ్ సమయంలో వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌పై ట్రోల్స్‌ రావడంతో దర్శకుడు వశిష్ట మరింత పక్కాగా సినిమాను రూపొందిస్తున్నాడు. 2023లో చిరు పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్టుని ప్రకటించగా.. అక్టోబరు నుంచి షూటింగ్ కూడా మొదలుపెట్టారు. 2024లో ఎ‍ప్పుడైతే గ్లింప్స్‌ రిలీజ్ చేశారో అప్పటి నుంచి ఈ సినిమాకు కష్టాలు మొదలయ్యాయి. గ్లింప్స్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. గతేడాది ఓ సాంగ్, మరో గ్లింప్స్ అప్‌డేట్స్ వచ్చాయి గానీ అవి సినిమాపై హైప్ క్రియేట్ చేయలేకపోయాయి.

అయితే కొంత కాలంగా ఈ సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్‌లు రాకపోవడంతో అభిమానులు నిరాశలోనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ‘విశ్వంభర’ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఇటీవలే చిరంజీవి గారి ‘విశ్వంభర’ మూవీ ట్రైలర్ చూశాను. బొమ్మ వేరే లెవెల్‌లో ఉంది. ఇది విడుదలైన తర్వాత ట్రైలర్‌ అదిరిపోయిందనే అందరూ మాట్లాడుకుంటారు. ఈ ట్రైలర్ చూడగానే నాకు హై ఓల్టేజ్‌ అనుభూతి కలిగింది. అత్యాధునిక సౌండ్, ప్రొజెక్షన్ సిస్టమ్‌లో ఈ ట్రైలర్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. ‘విశ్వంభర’ ట్రైలర్ చూసే స‌మ‌యంలో మ‌న‌కు తెలియ‌కుంగానే గూస్ బంప్స్ రావ‌డం, ఆ విజువల్స్‌ వెన‌కాల దాగి ఉన్న అనేక‌ స్టోరీ లేయ‌ర్లు క‌న‌బ‌డి వావ్ అనిపించ‌క మాన‌దు. ‘విశ్వంభర’ (Viswambhara) తో స‌రికొత్త ప్ర‌పంచాన్ని చూడ‌బోతున్నామా అనే ఫీల్ త‌ప్ప‌క క‌లుగుతుంది’ అని ఆయన అన్నారు. ప్రస్తుతం ధీరజ్ మొగిలినేని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ మూవీ ట్రైలర్ (Trailer) మార్చిలో విడుదల కావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.