టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ టాక్ ఆఫ్ ది టౌన్గా నిలుస్తోంది. ఈ నట దిగ్గజం ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చిత్రం చేస్తున్నారు. మెగాస్టార్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో సోషియో ఫాంటసీ జానర్ లో ఈ మూవీ తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సూపర్ హిట్ తర్వాత అనిల్ రావిపూడితో చిరంజీవి (Chiranjeevi ) ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయింది. ఈ సినిమా కథ రాసేందుకు దర్శకుడు అనిల్ రావిపూడి విశాఖపట్నం వెళ్లి మరీ పక్కాగా సిద్ధం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి.
‘ఈ సినిమా ఫైనల్ స్క్రిప్ట్ మొత్తం పూర్తయింది. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) గారికి కథ మొత్తం చదివి వినిపించాను. నా స్టోరీలోని శంకర్ వరప్రసాద్ పాత్ర గురించి చిరుకు చెప్పాను. కథ ఆయనకు బాగా నచ్చింది. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఆలస్యం ఎందుకు త్వరలోనే ముహూర్తంతో చిరునవ్వుల పండగబొమ్మకు శ్రీకారం చుట్టేద్దాం’ అని ట్విటర్లో అనిల్ రావిపూడి ట్వీట్ చేశాడు. కాగా, చిరంజీవి అసలు పేరు శివ శంకర్ వర ప్రసాద్ అనే సంగతి తెలిసిందే. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ ఉగాది పండుగ రోజు ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారని తెలిసింది. కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై నిర్మించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నాడు.


