ఆర్‌సీ16′: జాన్వీకి ఉపాసన స్పెషల్ గిఫ్ట్.. అందుకోసమేనా!

by | Mar 20, 2025 | వార్తలు

మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలతో సంబంధం లేకపోయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. రామ్ చరణ్ (Ram Charan) భార్యగా మాత్రమే కాదు వ్యాపారవేత్తగాను రాణిస్తోంది. అయితే రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఆర్సీ16’. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ వివిధ ఆటలు ఆడతాడ‌ని స‌మాచారం. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో జ‌రుపుకుంది. అయితే ఈ సినిమా సెట్స్‌కి తాజాగా ఉపాసన (Upasan) వెళ్ళినట్ల తెలుస్తోంది. రామ్‌ చరణ్‌తో ఈ మూవీ సెట్స్‌కి వెళ్లిన ఉపాసన తనతో పాటు కొన్ని స్పెషల్ గిఫ్ట్స్ తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హీరోయిన్ జాన్వీ కపూర్‌కి ఆ కానుకలను అందించారట ఉపాసన.

ఇటీవలే మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) సతీమణి సురేఖ గారితో కలిసి ఉపాసన ‘అత్తమ్మాస్‌ కిచెన్‌’ పేరుతో ఫుడ్‌ బిజినెస్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తన అత్తగారైన సురేఖ కొణిదెల వంటలను అందరికీ రుచి చూపించేలా అత్తమ్మ కిచెన్ పేరుతో ఫుడ్ బిజినెస్‌ను ప్రారంభించారు ఉపాసన. అప్పటికప్పుడు తయారుచేసుకునేలా నాణ్యమైన డ్రై హోమ్‌ ఫుడ్స్‌ని అందించే లక్ష్యంతో దీనిని మొదలుపెట్టగా వ్యాపారం విజయవంతంగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఉపాసన, సురేఖ గారు కలిసి నిర్వహిస్తున్న అత్తమ్మాస్ కిచెన్‌కి చెందిన స్పెషల్ ఫుడ్ ప్రాడక్ట్స్ జాన్వీ కపూర్‌కి అందించారట. ఇందుకు జాన్వీ కపూర్ కూడా సంతోషం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఇక సినిమా విషయనికొస్తే.. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.

ఇందులో శివరాజ్‌కుమార్, దివ్యేండు శ‌ర్మ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ ఢిల్లీ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలోని పార్లమెంట్‌ భవనం ఆవరణలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందట. ఇక్కడ రామ్‌చరణ్‌తో పాటు ఇతర ముఖ్య నటులపై సీన్స్ షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అధికారుల అనుమ‌తులు కూడా అందినట్లు సమాచారం. అలాగే కథలో భాగంగా ఢిల్లీలోని జామా మసీదు ఆవరణలోనూ ముఖ్య సన్నివేశాలు చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. ఇందుకోసం మేకర్స్ అనుమతులు కూడా తీసుకున్నార‌ని స‌మాచారం. కాగా, ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తుండ‌గా, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకుగా ఈసినిమా రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది.