వాట్ ఏ కాంబో గురూ.. మ‌ణిర‌త్నంతో నవీన్ పోలిశెట్టి మూవీ ఫిక్స్!

by | Feb 21, 2025 | సినిమా

టాలీవుడ్ లో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి ర‌త్న‌లు, మిస్‌ శెట్టి, మిస్ట‌ర్ పోలిశెట్టి వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యువ హీరో న‌వీన్ పోలిశెట్టి. గతేడాది ఆయన కుడి చేతికి గాయమవగా పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం న‌వీన్ పోలిశెట్టి సితార ఎంటైర్టెన్మెంట్స్‌ పతాకంపై యువ డైరెక్టర్ మారి దర్శకత్వంలో ‘అనగనగా ఒక రాజు’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంట‌ర్‌టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్‌లో న‌టిస్తోంది. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో వస్తోన్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. మిక్కీ జే మేయర్‌ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేస్తుండగా.. ఈ ఏడాది ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

అయితే ఈ సినిమా తరువాత న‌వీన్ పోలిశెట్టి ఏ సినిమా చేయబోతున్నారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే నవీన్ పోలిశెట్టికి ఓ క్రేజీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. నవీన్ తన తదుపరి సినిమాను లెజెండరీ డైరెక్టర్ మణిర‌త్నంతో చేయ‌బోతున్న‌ట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం మ‌ణిర‌త్నం థ‌గ్ లైఫ్ అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. క‌మ‌ల్ హాస‌న్, శింబు ముఖ్య పాత్ర‌ల్లో రూపొందుతున్న ఈ సినిమా ఈ ఏడాది వేసవి కానుక‌గా విడుదల కానుంది. ఆ తర్వాత ఆయన నవీన్ పోలిశెట్టితో సినిమాను పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఫుల్ లెంగ్త్ ల‌వ్ బ్యాక్‌డ్రాప్‌ మూవీగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన వివరాలను త్వ‌ర‌లోనే అధికారికంగా ప్రకటించాలని మేకర్స్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.