కళ్లుచెదిరే ధ‌రకు ‘రణబాలి’ థియేట్రిక‌ల్ రైట్స్‌

by | Jan 27, 2026 | సినిమా

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devara Konda) కథానాయకుడిగా దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో రాబోతున్న‌ ‘రణబాలి’ టైటిల్ గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న విష‌యం తెలిసిందే. గణతంత్ర దినోత్సవ కానుకగా విడుదలై ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గ్లింప్స్‌లో ‘రణబాలి’ (Ranabaali)అనే యోధుడి పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించగా.. కథానాయిక రష్మిక మందన్న (Rashmika Mandana) జయమ్మగా కనిపించారు. ప్రతినాయకుడు సర్ థియోడోర్ హెక్టార్ పాత్రలో ఆర్నార్డ్ వోస్లూ నటిస్తున్నాడు. 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. బాలీవుడ్ ఫేమ్ అజయ్-అతుల్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

ఈ చిత్రాన్ని టీ సీరీస్ (T Series) సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబరు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ‘రణబాలి’ (Ranabaali) సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీ పోస్ట్ థ్రియాట్రికల్‌ రైట్స్‌ భారీ మొత్తానికి అమ్ముడుపోయినట్టు టాలీవుడ్ సర్కిల్ సమాచారం. తాజా టాక్ ప్రకారం డిజిటల్‌ స్ట్రీమింగ్ రైట్స్‌ను పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) దక్కించుకోగా.. శాటిలైట్‌ రైట్స్‌ను జీ ఛానల్ (Zee Telugu) రికార్డ్‌ ధరకు కొనుగోలు చేసిందని సమాచారం. దీనిపై నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గత కొంతకాలంగా బ్యాక్‌ టు బ్యాక్‌ డిజాస్టర్‌లు పడినా కూడా విజయ్ దేవరకొండ సినిమాకు ఈ రేంజ్‌లో బిజినెస్‌ జరగడం అంటే విశేషం అనే చెప్పాలి. ఏదేమైనా ‘రణబాలి’ మూవీ పోస్ట్‌ థ్రియాట్రికల్‌ రైట్స్ విషయంలో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తుంది.